HomeSports Teluguయూఏఈ బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. కేవలం 32 బంతుల్లో సెంచరీ!

యూఏఈ బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. కేవలం 32 బంతుల్లో సెంచరీ!

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు. పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ చెలరేగి రికార్డుల వర్షం కురిపించాడు. అతని ఆగ్రెసివ్ ఇన్నింగ్స్‌తో భారత్ ‘ఏ’ జట్టు 148 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఏ’ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 297 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ యూఏఈ బౌలర్లను ఊచకోత కోశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు దోహా స్టేడియంలో ఫోర్లు, సిక్సర్లతో పరుగుల పండుగ కొనసాగించాడు.

కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ, మరో 15 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్, కేవలం 32 బంతుల్లో శతకం బాదాడు. దీంతో టీ20ల్లో భారత్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రిషభ్ పంత్ రికార్డును సమం చేశాడు.

మొత్తం 42 బంతుల్లో 144 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు, 11 ఫోర్లు ఉండటం విశేషం. అతని తర్వాత కెప్టెన్ జితేశ్ శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.. 32 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరి దుమ్ముదులిపే బ్యాటింగ్‌తో భారత్ ‘ఏ’ జట్టు స్కోరు ఆకాశాన్ని తాకింది.

చేదనలో యూఏఈ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులకే పరిమితమైంది. బ్యాటర్ షోయబ్ ఖాన్ (63) తప్ప మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లు గుర్జాన్‌ప్రీత్ (3 వికెట్లు), హర్ష్ దూబే (2 వికెట్లు) సత్తా చాటారు.

ఈ విజయంతో భారత్ ‘ఏ’ జట్టు టోర్నీకి శుభారంభం చేసింది. వైభవ్‌ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular