ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తమ సత్తా చాటింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. గత సీజన్లో తొలి కప్ను గెలిచిన బెంగళూరు.. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తూ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (10), సాయి సుదర్శన్ (12) త్వరగా ఔటవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. మధ్య ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.

మిడిల్ ఆర్డర్ కూడా విఫలమైన సమయంలో జోస్ బట్లర్ (19), నిశాంత్ (20) కాసేపు పోరాడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం మూడు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్వుడ్ చెరో రెండు వికెట్లు సాధించారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులతో శుభారంభం అందించగా, విరాట్ కోహ్లీ మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిపోయాడు.
రజత్ పటీదార్ (15), టిమ్ డేవిడ్ (24)లు తమ వంతు సహకారం అందించడంతో ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సారథిగా బాధ్యతలు చేపట్టిన తొలి రెండు సీజన్లలోనే జట్టును ఛాంపియన్గా నిలిపిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు.
ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా, టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. టైటిల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్మనీ లభించగా, రన్నరప్ గుజరాత్ టైటాన్స్కు రూ.12.5 కోట్ల నగదు బహుమతి దక్కింది.
BACK-2-BACK IPL WINNING CAPTAIN. ⭐️⭐️ pic.twitter.com/Kibw9hZEtF
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026





