మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది. సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రదర్శనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. సినిమా విడుదలైన తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 వరకు పెంపునకు అనుమతి లభించింది. అలాగే ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం గరిష్ట టికెట్ ధరను రూ.600గా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
దీంతో విడుదలకు ముందే ‘పెద్ది’ సినిమాపై మరింత హైప్ పెరిగింది. టికెట్ ధరల పెంపుతో పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. సాధారణంగా రోజుకు నాలుగు షోలు మాత్రమే నిర్వహించే అవకాశం ఉండగా.. ‘పెద్ది’ కోసం అదనంగా మరో షో ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులకు భారీ ఊరట లభించనుంది.
భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి తొలి 10 రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, టికెట్ ధరల పెంపు, రోజుకు 5 షోలకు అనుమతి వంటి నిర్ణయాలు ‘పెద్ది’ సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వనున్నాయి.





