టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గత కొన్ని రోజులుగా ఎంజీఆర్ (MGR)పై చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచారు. ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదజాలంపై కోలీవుడ్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి.
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై తమిళ సినీ పరిశ్రమ నుంచి గట్టి స్పందన వచ్చింది. రజనీకాంత్, నాజర్, విశాల్ వంటి ప్రముఖ నటులు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒక లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడటం సరైంది కాదని పేర్కొంటూ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం రెండు సినీ పరిశ్రమల మధ్య చర్చనీయాంశంగా మారింది.
పరిస్థితి తీవ్రతను గమనించిన రాజేంద్ర ప్రసాద్ చివరకు ఒక వీడియో సందేశం విడుదల చేసి బేషరతుగా క్షమాపణలు తెలిపారు.
ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలోనే క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్ #RajendraPrasad #MGR #kollywood pic.twitter.com/0tIuck2xSJ
— iQlik Movies (@iqlikmovies) March 13, 2026
‘తమిళ ప్రేక్షకుల మాదిరిగానే నేను కూడా ఎంజీఆర్ గారిని ఎంతో గౌరవిస్తాను. కాంతారావు గారిని ప్రశంసించే క్రమంలో ఆవేశంలో నోరుజారాను తప్ప, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అవమానించాలని నా ఉద్దేశం కాదు. అది అనుకోకుండా జరిగిన పొరపాటు’ అని ఆయన వివరించారు.
అలాగే చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న రోజుల్లో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, తాము నటిస్తుంటే ఆయన వచ్చి చూసేవారని గుర్తు చేసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తిపై తనకు ఎప్పుడూ గౌరవం ఉందని చెప్పారు.
తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించమని రాజేంద్ర ప్రసాద్ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని హామీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఎట్టకేలకు ముగింపు పలికినట్లైంది.





