ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ ప్లాట్ఫార్మ్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్-యూట్యూబర్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్పై చేసిన ఆరోపణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “ఐబొమ్మ రవి దమ్మున్న వాడే.. అందుకే ప్రజలు అతనికి సపోర్ట్ చేస్తున్నారు” అని మల్లన్న వ్యాఖ్యానించారు. రవి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వకపోయి ఉంటే, పోలీసులు అతడిని ఎప్పటికీ పట్టుకోలేరని అన్నారు.
అలాగే సినిమా పరిశ్రమ పై విమర్శలు చేస్తూ.. “₹100 టికెట్ను వెయ్యిల్లో అమ్ముకుంటే వాళ్లు సంసారులా?” అని ప్రశ్నించారు. సీపీ సజ్జనార్ సినిమా పెద్దలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడంపై కూడా విమర్శలు గుప్పించారు.
మల్లన్న ఆగకుండా.. “సజ్జనార్ చేసే పనులన్నీ ఫేక్ ఎన్కౌంటర్లే.. వరంగల్ ఘటన కూడా అలాగే జరిగింది” అంటూ ఆరోపణలు చేశారు. “మీకు దమ్ముంటే దేశంలో జరుగుతున్న పెద్ద సైబర్ క్రైమ్స్, కిడ్నాప్లు, ఆర్థిక నేరాలను ఆపి చూపండి” అంటూ సజ్జనార్ను సవాల్ విసిరారు.
అలాగే.. “ఇలాంటి సైబర్ నేరాలు ఎప్పటికీ ఆగవని” సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
మల్లన్న చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖను అగౌరవపరిచారంటూ మండిపడుతున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది.





