HomePolitics Teluguఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు (Formula E-Car Race) లో రూ.55 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఆరోపణలపై, మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) క్రిమినల్ కేసు నమోదు చేసుకునేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.

సెప్టెంబర్ 9న ఏసీబీ పంపిన ఫైల్‌ రాజ్‌భవన్‌కు చేరగా, రాష్ట్రపతి కార్యాలయ న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకున్న అనంతరం గవర్నర్ బుధవారం–గురువారం మధ్య రాత్రి ఫైల్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో కేటీఆర్‌తో పాటు మాజీ HMDA చీఫ్ ఇంజినీర్ బీఎల్వీ రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్‌లపై ఏసీబీ త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడంతో, కేసు మరింత వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే కేసులో కేటీఆర్ నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-ప్రిక్స్ రేసు నిర్వహణ కోసం ఏస్ ఆటోమొబైల్స్ (Greenco Group)‌తో ఎలాంటి అధికారిక ఒప్పందం లేకుండానే ₹54.88 కోట్లు చెల్లించారని, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై ఏసీబీ కీలక ఆరోపణలు చేసింది.

ఆర్థిక శాఖ మరియు RBI అనుమతి లేకుండా విదేశీ కంపెనీ ‘Formula E Operations’‌కు నిధులు బదిలీ చేశారని, HMDA–గ్రీన్‌కో–ఫార్ములా ఈ మధ్య రహస్య ఒప్పందాలు జరిగినట్లు కూడా ఏసీబీ పేర్కొంది.

ఈ పరిణామంతో ఫార్ములా ఈ–కార్ రేసు వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌పై తదుపరి చట్టపరమైన చర్యలకు దారి తీసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular