బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని సాధించిన తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో సీఎంగా మరోసారి నితీశ్ కుమార్ ఎంపిక ఖరారైంది.
బుధవారం జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీశ్ కుమార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మరికొద్ది సేపట్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమని అధికారిక లేఖ సమర్పించనున్నట్లు సమాచారం.
గురువారం నితీశ్ కుమార్ సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆయన ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణం చేయడం కావడం ప్రత్యేకత. ఆయనతో పాటు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించబడుతుంది.
ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాలు సాధించగా, మహాగఠ్బంధన్ కూటమి 35 సీట్లతో మాత్రమే పరిమితమైంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, పెరిగిన పెన్షన్ వంటి హామీలను ప్రకటించిన మహాగఠ్బంధన్పై కాకుండా, బీహార్ ప్రజలు మరోసారి నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే గట్టి మద్దతు ఇచ్చారు.





