తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఇక లేరు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయనను పరిశీలించి అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.
అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల సాహితీ లోకం, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, కవులు, కళాకారులు ఆయనకు నివాళులు అర్పించారు.
గొర్రెల కాపరిగా మొదలైన అందెశ్రీ ప్రయాణం
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం, రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకుని, గొర్రెల కాపరిగా జీవనాన్ని ప్రారంభించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేశారు. పాఠశాల విద్య లేకపోయినా, ఆయన సాహితీ ప్రతిభతో మేటి కవిగా ఎదిగారు.
తెలంగాణ ఉద్యమంలో స్వరం ఇచ్చిన కవి
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందెశ్రీ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన రాసిన ‘మాయమైపోతున్నడమ్మా’ పాట తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా మారింది. తెలంగాణ రాష్ట్ర గీత రచయితగా ఆయన రాసిన పదాలు ప్రతి తెలుగు మనసుని తాకాయి. అశువు కవిత్వం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.
సాహితీ, సినీ రంగానికి చేసిన సేవలు
అందెశ్రీ సాహిత్యంతో పాటు సినీ రంగానికీ సేవలందించారు. 2006లో విడుదలైన ‘గంగ’ చిత్రానికి గాను ఆయనకు నంది పురస్కారం లభించింది.
తన సాహిత్య ప్రస్థానంలో అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నారు:
2014: అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
2015: దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
2022: నకమ్మ జాతీయ పురస్కారం
2024: దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్
అందెశ్రీ కుటుంబంలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన చనిపోవడం తెలంగాణ సాహితీ రంగానికి పూడ్చలేని లోటుగా భావిస్తున్నారు కవులు, అభిమానులు.





