పుట్టపర్తి సత్యసాయి బాబా (Sathya Sai Baba) శత జయంతి ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
మంగళవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర సభ్యులు పవన్ కల్యాణ్ను కలుసుకుని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా శత జయంతి ఉత్సవాల వివరాలను తెలియజేశారు.

నవంబర్ 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శత జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ కూడా ప్రధానమంత్రితో కలిసి ఈ వేడుకలకు హాజరవుతానని ట్రస్ట్ సభ్యులకు హామీ ఇచ్చారు.
సత్యసాయి శత జయంతి సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భక్తుల సౌకర్యార్థం రహదారుల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.30 కోట్లు అదనంగా కేటాయించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శత జయంతి ఉత్సవాల నాటికి మందిరానికి అనుసంధాన రహదారులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక నిధుల కేటాయింపుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సత్యసాయి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు.





