జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఆయన 24,658 ఓట్ల భారీ మెజార్టీతో బీఆర్ఎస్పై విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగగా, చివరి రౌండ్ వరకు ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.
ఈ ఫలితంతో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోగా, బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. కౌంటింగ్ మధ్యలోనే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి లెక్కింపు కేంద్రాన్ని వీడటం గమనార్హం.
కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యంలోనే కొనసాగింది. ముఖ్యంగా షేక్పేట్, వెంగళ్రావు నగర్, రెహమత్ నగర్ డివిజన్లలో పార్టీకి భారీ మెజార్టీ వచ్చింది. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఓట్ల తేడా పెరుగుతూ వచ్చింది. చివరికి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లిన నవీన్ యాదవ్ విజయం సాధించి పార్టీకి గర్వకారణంగా నిలిచారు.
ఈ విజయం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని నేతలు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మండల కేంద్రాల్లో, పట్టణాల్లో పటాకులు కాలుస్తూ, పార్టీ జెండాలు ఊపుతూ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ఈసారి కాంగ్రెస్కు మరొకసారి హైదరాబాద్ లో బలం చాటుకునే అవకాశం కల్పించాయి.





