HomeSports Teluguతొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్!

తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్!

భారత్ vs వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ ముగిసింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా 140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజ వేసింది.

మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో 286 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. లంచ్‌కే 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులకే పరిమితమయ్యారు. లంచ్ తరువాత కూడా కరేబియన్ బ్యాటర్లు నిలవలేకపోయారు.

వెస్టిండీస్ తరఫున అలిక్ అథనేజ్ 74 బంతుల్లో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ 25, జాన్ క్యాంప్‌బెల్ 14 పరుగులు చేసి కొంత పోరాడారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.

రెండో రోజు భారత బ్యాటర్లు విజృంభించారు. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిసారు. రాహుల్ 100 పరుగులు, జురేల్ 125 పరుగులు చేయగా, జడేజా 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular