భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ధురంధర్-2: ది రివెంజ్ గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలై 10 రోజులు గడిచినా థియేటర్ల వద్ద జనం రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా దూసుకుపోతూ కేవలం 10 రోజుల్లోనే రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి చాటిచెప్పింది.
ఈ చిత్రానికి సంబంధించిన అతిపెద్ద హైలైట్ ఏమిటంటే.. ఉత్తర అమెరికాలో గత 9 ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న బాహుబలి-2 రికార్డును ధురంధర్-2 బద్దలు కొట్టడం. దీంతో ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.
Congratulations to @AdityaDharFilms and the entire team of #Dhurandhar2TheRevenge on breaking the 9-year-old records of #Baahubali2 and setting new box office benchmarks in India, USA and worldwide! https://t.co/6UjDFKbpA4
— Baahubali (@BaahubaliMovie) March 29, 2026
రణ్వీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ గ్రిప్పింగ్ మేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ విజయంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిన్న నేను ధురంధర్-2 చూశాను. సినిమా చాలా బాగా నచ్చింది.. పూర్తిగా ఆస్వాదించాను. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ కొత్త బెంచ్మార్క్లను సృష్టిస్తోంది. చిత్ర బృందానికి అభినందనలు అని ఆయన సోషల్ మీడియాలో రాశారు.

తన సినిమా రికార్డులు బ్రేక్ అయినప్పటికీ, ఎంతో స్పోర్టివ్గా స్పందించిన శోభు యార్లగడ్డపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ధురంధర్-2 బాక్సాఫీస్ దూకుడు చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.





