అల్లు అరవింద్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas) మల్టీప్లెక్స్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లోని ఐటీ హబ్ కోకాపేటలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ను నిర్మించారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబాన్ని సీఎం అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తనకు సినిమాలంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ‘నేను సినిమా అభిమానిని. భారతదేశంలో సినిమా రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో తెలుగు సినిమా కీలక పాత్ర పోషించింది’ అని పేర్కొన్నారు.

కాలేజీ రోజుల్లో తాను కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాడినని గుర్తుచేసుకున్నారు. ‘మేము లారీల్లో వెళ్లి సినిమాలు చూసి తిరిగొచ్చేవాళ్లం. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సంవత్సరానికి నాలుగు, ఐదు సినిమాలు విడుదల చేసేవారు. ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు’ అని అన్నారు.
సినిమా కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. మధ్యతరగతి ప్రజల జీవితాలపై సినిమాకు చాలా ప్రభావం ఉంటుంది అని చెప్పారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను కూడా ముఖ్యమైన పరిశ్రమగా భావిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమ అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అని తెలిపారు.
@revanth_anumula launched #Allucinemas #alluarjun #Revanth pic.twitter.com/v7WlIeYrtc
— SZN (@Suzenbabu) March 12, 2026
తెలుగు సినిమా ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలుగు సినిమా ఇప్పుడు హాలీవుడ్తో పోటీ పడుతోంది. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు హైదరాబాద్లో షూటింగ్ చేసేలా మనం వాతావరణాన్ని సృష్టించాలి’ అని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని కృష్ణానగర్ సినీ రంగానికి ఎన్నో ప్రతిభావంతులను అందించిందని చెప్పారు. అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు.
‘అల్లు అర్జున్ ఇప్పటికే తన ప్రతిభను దేశవ్యాప్తంగా నిరూపించుకున్నారు. ఇక భవిష్యత్తులో హాలీవుడ్ వరకు వెళ్లి మరింత పెద్ద స్థాయిలో రాణించాలి. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే స్థాయికి ఆయన ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.





