కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయనపై నమోదైన పోక్సో కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది.
ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో భగీరథ్పై బాధితురాలి తల్లి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, తనను కావాలనే ట్రాప్ చేశారని ఆరోపిస్తూ భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధించిన కేసు కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. విచారణ పారదర్శకంగా జరగాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారిస్తోంది.
సాధారణంగా పోక్సో కేసుల్లో 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉండగా, ఇప్పటివరకు భగీరథ్ అరెస్ట్ కాకపోవడం చర్చకు దారితీసింది. అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరని, దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
మొత్తానికి, ఈ కేసులో తర్వాతి పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.





