మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. రీల్ హీరోగానే కాదు, రియల్ హీరోగానూ గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు సమాజంలో కీలక సమస్యగా ఉన్న పేదరికాన్ని ఎదుర్కొనేందుకు విద్యను ఆయుధంగా ఎంచుకున్నారు. ఉగాది సందర్భంగా ప్రకటించిన ‘ఉచిత విద్యా ప్రాజెక్ట్’ రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, సాధారణ ప్రజల్లో ఆశలు నింపుతోంది.
ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ల ద్వారా లక్షలాది మందికి సహాయం చేసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు రక్తదానం గురించి అవగాహన తక్కువగా ఉన్న రోజుల్లోనే ఆ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆయన, ఇప్పుడు విద్య ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చనే నమ్మకంతో ముందుకు వస్తున్నారు.
ఈ విషయాన్ని గురువారం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు. త్వరలోనే ఒక ఉచిత విద్యా ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని తన ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రేరణ గురించి కూడా చిరంజీవి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ప్రారంభించిన రక్తదానోద్యమాన్ని చూసి స్ఫూర్తి పొందిన తమిళ నటుడు సూర్య, తన తండ్రి శివకుమార్ పేరుతో ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
Beyond cinema, a heart that beats for society ❤️
— Team Megastar (@MegaStaroffl) March 19, 2026
On this Ugadi, Megastar Chiranjeevi garu announced that his next noble initiative will be
“to provide free education to the underprivileged.”
A true Megastar who continues to inspire by giving back to society 🙏#Chiranjeevi… pic.twitter.com/p2DLI1JiH8
ఇప్పుడు అదే విధంగా సూర్య చేస్తున్న విద్యా సేవను చూసి తాను కూడా ప్రేరణ పొందుతున్నానని చిరంజీవి చెప్పారు. మంచి ఎక్కడ కనిపించినా దాన్ని స్వీకరించి, మరింత మందికి ఉపయోగపడేలా చేయాలనేదే తన ఆలోచన అని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించి, వారి కుటుంబాల భవిష్యత్తును మార్చాలని చిరంజీవి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లాభపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చిరంజీవి ఈ ప్రకటనతో సినీ వర్గాలు, రాజకీయ వర్గాలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సహాయం చేసిన ఆయన, ఇప్పుడు విద్య రంగంలోకి అడుగుపెట్టడం మరో మైలురాయిగా మారింది.
ఈ ఉచిత విద్యా ప్రాజెక్ట్కు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.





