బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర 2025 నవంబర్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆయనకు సంబంధించిన ఒక అంశం వివాదానికి దారితీసింది. ప్రతి ఏడాది మరణించిన సినీ ప్రముఖులకు అర్పించే ‘ఇన్ మెమోరియం’ నివాళి విభాగంలో ధర్మేంద్ర పేరు ప్రసారంలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై ఆయన భార్య, ప్రముఖ నటి హేమమాలిని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న గొప్ప నటుడిని ఇలా విస్మరించడం బాధాకరం. వారు గౌరవించకపోయినా, ధర్మ్ జీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్మేంద్ర తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసినప్పటికీ, పెద్దగా అవార్డులు పొందలేదని హేమమాలిని గుర్తుచేశారు. అయితే అవార్డుల కోసం ఆయన ఎప్పుడూ ఆత్రుత చూపలేదని, ప్రజల ప్రేమే తనకు పెద్ద గుర్తింపని భావించేవారని తెలిపారు. ‘మన దేశ ప్రజల ప్రేమ పొందినప్పుడు అవార్డులు అవసరం లేదు’ అని ఆమె అన్నారు.

ఇక ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ కూడా స్పందిస్తూ, తన తండ్రి ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరని స్పష్టం చేశారు.

అయితే ఆస్కార్ అకాడమీపై వచ్చిన విమర్శల మధ్య ఒక విషయం గమనార్హం. టెలివిజన్ ప్రసారంలో ఆయనకు చోటు దక్కకపోయినా, అకాడమీ విడుదల చేసిన అధికారిక ఆన్లైన్ జాబితాలో మాత్రం ధర్మేంద్ర పేరు చేర్చబడింది. ఆయనతో పాటు భారతీయ సినీ రంగానికి చెందిన సరోజా దేవి, మనోజ్ కుమార్, జయశ్రీ కబీర్, కోట శ్రీనివాసరావు, ఎస్. కృష్ణస్వామి పేర్లను కూడా జాబితాలో చేర్చారు.

ఈ ఘటనతో ఆస్కార్ వేదికపై భారతీయ దిగ్గజాలకు సరైన గౌరవం దక్కలేదనే విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి.





