ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మూర్తిపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయ్యింది. తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలపై కూకట్పల్లి పోలీసులు జర్నలిస్ట్ మూర్తిపై కేసు నమోదు చేశారు.
తెలుసుకున్న వివరాల ప్రకారం, ధర్మ మహేష్తో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా అతని భార్య గౌతమి చౌదరి జర్నలిస్ట్ మూర్తితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ముందుగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ తర్వాత తన ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ ప్రయత్నం చేశారని, రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ధర్మ మహేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
కోర్టు ఆదేశాల మేరకు కూకట్పల్లి పోలీసులు గౌతమి చౌదరిని A1గా, జర్నలిస్ట్ మూర్తిని A2గా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఇదిలా ఉంటే, ధర్మ మహేష్ ‘డ్రింకర్ సాయి’, ‘సింధూరం’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరిని వివాహం చేసుకున్న ఆయన, వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఇద్దరూ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇటీవల కూడా ధర్మ మహేష్ జర్నలిస్ట్ మూర్తిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇప్పుడు కోర్టు ఆదేశాలతో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.





