మన హీరోలు చాలా మంచోళ్లు. తమ నిర్మాతల్ని కంటికి రెప్పలా కాపాడుకొంటుంటారు. సినిమా ఫ్లాప్ అయితే, తమ పారితోషికాలను వదులుకొన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ జాబితాలో నందమూరి బాలకృష్ణ పేరు కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తన నిర్మాతల్ని ఆదుకొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అఖండ నిర్మాతలకు కూడా తన ఆపన్నహస్తం అందించాడు బాలయ్య.
అఖండ 2…. ఈవారమే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈసినిమా డిసెంబరు 5న రావాలి. కానీ నిర్మాత ఆర్థిక ఇబ్బందుల వల్ల రాలేదు. ఈరోస్ సంస్థ 14 రీల్స్ పై కోర్టులో కేసు వేయడం, దాదాపు రూ.15 కోట్ల వరకూ చెల్లించాల్సిరావడం తెలిసిన విషయాలే. ఈ మొత్తం చెల్లించడంలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను నిర్మాతలకు సాయం చేశారట. తమ పారితోషికాల నుంచి చెరో రూ.7.5 కోట్లు వెనక్కి ఇచ్చి, నిర్మాతల్ని ఆదుకొన్నారట. హీరో, దర్శకుడు ఇచ్చిన డబ్బులతోనే నిర్మాతలు పాత బాకీ తీర్చారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఈ సినిమాకు గానూ బాలయ్య రూ.40 కోట్లు, బోయపాటి రూ.30 కోట్లు పారితోషికాలు అందుకొన్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. అందులోంచే కొంత మొత్తం నిర్మాతలకు వెనక్కి ఇచ్చారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు రూ.300 కోట్లు సాధించాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి నుంచే అఖండ 2 ప్రీమియర్ షోల హడావుడి మొదలైపోతుంది.





