జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో కేవలం 10 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇదిలా ఉంటే, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నపాటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలిస్తూ వెళ్తుండగా, ఆమెను పోలీసులు ఆపి వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. దీనిపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఎమ్మెల్యే అభ్యర్థినైనా అడ్డుకుంటారా?” – మాగంటి సునీత ఆగ్రహం
పోలీసులు ఆమెను అడ్డుకోవడంపై మాగంటి సునీత ఆవేశంగా స్పందించారు. “ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి? ఇలాగే ప్రవర్తిస్తారా?” అని ప్రశ్నించారు. “సింపుల్గా తీసిపడేయొద్దు. మేము కూడా నియమాల ప్రకారం ఉన్నాం” అంటూ మండిపడ్డారు.
అభ్యర్థికి పోలింగ్ కేంద్రాలు తిరిగే హక్కు లేదా.. ఇదెక్కడి దౌర్జన్యం!
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అడ్డుకొని, బలవంతంగా వెనక్కి పంపిస్తున్న పోలీసులు
ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి అంటూ మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు
పోలీసుల… pic.twitter.com/2Bhnam1CSP
తరువాత మీడియాతో మాగంటి సునీత మాట్లాడుతూ
“మా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు, వారిని ఎవరూ ఆపడం లేదు. ఎంత అధికారంలో ఉన్నా, ఇలా పాక్షికంగా ప్రవర్తించడం సరైంది కాదు. ఓటింగ్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆమె ఆరోపించారు.
పోలీసులు – బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
ఈ ఘటన తరువాత బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పెద్ద ఎత్తున ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు.
అంతా కలిపి, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మొత్తంగా ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ, కొన్ని చోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.





