జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఆయన తల్లి మహానందకుమారి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ తన కుమారుని మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనను చూడనీయలేదని, అయితే కేటీఆర్ను మాత్రం లోపలికి అనుమతించారని ఆమె ఆరోపించారు. వైద్య చికిత్సలో నిర్లక్ష్యం కారణంగానే గోపీనాథ్ మరణించారని, మరణ ధృవీకరణలో కూడా ఆలస్యం జరిగిందని మహానందకుమారి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదులో ఆమె ఇలా వివరించారు – “2025 జూన్ 5న నా కుమారుడు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు. ఆయన కుమార్తె దిషిర సంతకం చేసిన లేఖ కారణంగా నన్ను చూడనివ్వలేదు. గత కొన్ని నెలల వైద్య రిపోర్టుల ప్రకారం గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ సమయానికి సరైన చికిత్స ఇవ్వకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. డయాలసిస్లో జాప్యం, మూత్రపిండాల తొలగింపు తర్వాత తీసుకున్న నిర్ణయాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికితీయాలి” అని పేర్కొన్నారు.
ఆమె తన ఫిర్యాదుతో పాటు కొన్ని వైద్య పత్రాలను (medical documents) కూడా పోలీసులకు సమర్పించారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ, “ప్రాథమిక విచారణ చేపట్టాం. తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం” అని తెలిపారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ జూన్ 8న తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మాగంటి కుటుంబాల్లో నెలకొన్న విభేదాలు ఈ ఘటనతో మరింత తీవ్రంగా మారాయి.





