హైదరాబాద్లో మందు బాబులకు పెద్ద షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) నేపథ్యంలో నగరంలో నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు (Liquor Shops) మూతపడనున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు నవంబర్ 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు డ్రైడేస్గా ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే మద్యం విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ నిర్ణయం ఎన్నికల నియమావళి ప్రకారం తీసుకున్నదని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా, ఆర్థికంగా కూడా చాలా హాట్టాపిక్గా మారింది. ఈ ఎన్నిక చాలా ఖరీదైనదిగా మారబోతోందని రాజకీయ వర్గాల అంచనా. ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుకోసం ఎటువంటి వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ ముగిసే వరకు కలిపి దాదాపు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని అంచనా. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతి ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు ఇచ్చే అవకాశముందని కూడా టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో మద్యం ద్వారా లంచాలు, ప్రలోభాలను అరికట్టే ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ నాలుగు రోజుల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. ఈ తేదీలలో బార్లు, వైన్ షాపులు, క్లబ్లలో కూడా మద్యం విక్రయం నిషేధం అమలులో ఉంటుంది.





