HomeTeluguనీ పిల్లలు చనిపోవాలంటూ ట్రోలింగ్.. సీపీ సజ్జనార్‌కు చిన్మయి ఫిర్యాదు

నీ పిల్లలు చనిపోవాలంటూ ట్రోలింగ్.. సీపీ సజ్జనార్‌కు చిన్మయి ఫిర్యాదు

టాలీవుడ్‌ సింగర్‌ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న దారుణమైన ట్రోలింగ్‌పై పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ, వ్యక్తిగతంగా దూషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో స్పేస్‌ నిర్వహిస్తూ, చిన్మయిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫెమినిస్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ “వాళ్లకు పిల్లలు పుట్టకూడదు, పుట్టినా వెంటనే చనిపోవాలి” వంటి దారుణమైన మాటలు మాట్లాడారు. అంతేకాకుండా చిన్మయి పేరును ఎత్తి బూతు పదజాలం వాడారు.

దీంతో చిన్మయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా పిల్లలు చనిపోవాలంటూ కామెంట్లు చేస్తున్న వాళ్లు నాపై మానసిక హింస చేస్తున్నారు. ఇలాంటి వేధింపులు ఇక భరించలేను” అంటూ సీపీ సజ్జనార్‌కు ఎక్స్‌ (Twitter) ద్వారా ఫిర్యాదు చేశారు.

తన ట్వీట్‌లో చిన్మయి ఇలా పేర్కొన్నారు – “వాళ్లకు నా అభిప్రాయాలు నచ్చకపోతే వదిలేయొచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు అసహ్యకరమైనవి. నేను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. 15 సంవత్సరాలు పట్టినా చట్టం తన పని తాను చేసుకోవాలి.”

చిన్మయి ట్వీట్‌పై సీపీ సజ్జనార్ వెంటనే స్పందించారు. సైబర్ క్రైమ్‌ విభాగానికి, హైదరాబాద్‌ పోలీసులకు విచారణ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చిన్మయి సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular