HomeTeluguకర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు.. వేర్వేరు సంఘటనలుగా బయటపడిన నిజాలు!

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు.. వేర్వేరు సంఘటనలుగా బయటపడిన నిజాలు!

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్‌ బస్సు దగ్ధ ఘటనలో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బస్సు మరియు బైక్‌ ప్రమాదాలు వేర్వేరు సమయాల్లో జరిగాయని పోలీసులు తేల్చారు.

పోలీసుల ప్రకారం.. బైక్‌ రైడర్‌ శివశంకర్‌ మొదట రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడు. ప్రమాదం తర్వాత శివశంకర్‌ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రోడ్డుపై పడిపోయిన బైక్‌ను పక్కకు తీసేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తుండగా, చీకట్లో వేగంగా వస్తున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు ఆ బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది.

దీంతో బైక్‌ పెట్రోల్‌ ట్యాంకు పగిలి మంటలు చెలరేగి, బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ విషయాలను ఎర్రిస్వామి తన స్టేట్‌మెంట్‌లో పోలీసులకు వెల్లడించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత విస్తరించారు.

ఇక ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular