ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని మంత్రి కొండా సురేఖ దంపతులు కలిశారు. దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం.
ఈ భేటీ సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
ఇక, ఇటీవల కొండా సురేఖ ఇంటి వద్ద చోటుచేసుకున్న హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ (Officer on Special Duty) సుమంత్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో జూబ్లీహిల్స్లోని ఆమె నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి కొండా సురేఖ గారి దంపతులు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. #Diwali2025 pic.twitter.com/obPUV1G86t
— Telangana CMO (@TelanganaCMO) October 20, 2025
సుమంత్ను అరెస్ట్ చేసేందుకు మఫ్టీ దుస్తుల్లో వెళ్ళిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురిని కొండా సుస్మిత (సురేఖ కుమార్తె) గేటు వద్దే అడ్డుకున్నారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన తల్లి బీసీ మహిళ అయినందున రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి కలిసి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.
ఇక తాజాగా ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.





