స్టాండప్ కామెడీ పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న కమెడియన్ అనుదీప్ కటికాల ఎట్టకేలకు స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిహారికల వ్యక్తిగత విషయాలపై చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి.
ఈ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్రంగా స్పందించడంతో పాటు, సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదం మరింత ముదిరి, హైదరాబాద్లోని ‘ది స్ట్రీట్ కామెడీ క్లబ్’ వద్ద మెగా అభిమానులు ఆందోళనకు దిగారు. అనుదీప్ కోసం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పరిస్థితిని గమనించిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఈ ఘటన ప్రభావంతో జూబ్లీహిల్స్, మాదాపూర్, సోమాజిగూడ ప్రాంతాల్లోని కొన్ని కామెడీ షోలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
ఇక మరోవైపు జనసేన నేతలు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
క్షమించాలి, ఇక ముందు అలా చేయను.
– స్టాండ్ అప్ కామెడీ పేరుతో వెకిలి మాటలు మాట్లాడిన అనుదీప్.#anudeep #standupcommedy #UANow pic.twitter.com/N5fgx6P1LZ
— UttarandhraNow (@UttarandhraNow) April 12, 2026
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అనుదీప్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరారు. ‘ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. నా మాటల వల్ల ఎవరికైనా నొప్పి కలిగితే క్షమించండి’ అని తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని కూడా చెప్పారు.
అయితే, ఈ క్షమాపణలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పబ్లిసిటీ కోసం హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి, అనుదీప్ కామెంట్స్ వివాదం పెద్ద దుమారం రేపగా, ఆయన క్షమాపణలతో ఈ వ్యవహారం కొంతమేర చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి.





