మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో ఫోక్ సింగర్ మంగ్లీ (సత్యవతి) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు డబ్బు డిమాండ్ చేశారని, ఇవ్వనందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో మంగ్లీ ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి, అడ్వకేట్ సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
మంగ్లీ మాట్లాడుతూ.. నా పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వాటన్నింటికీ నేనే బాధ్యురాలిని అవుతానా? నేను కూడా ఒక సాధారణ మనిషినే అని ప్రశ్నించారు. విషయం తెలిసిన వెంటనే బాధితులకు న్యాయం చేయాలని తానే ముందుకు వచ్చానని తెలిపారు.
నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నాకు డబ్బు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. డబ్బే ముఖ్యం అయితే ఎన్నికల సమయంలో వచ్చిన భారీ ఆఫర్లను కూడా నేను అంగీకరించేదాన్ని అని మంగ్లీ పేర్కొన్నారు.
ఈ వ్యవహారం గురించి మాట్లాడుతున్న సమయంలో మంగ్లీ కంటతడి పెట్టుకున్నారు. నాకు పాటలు పాడడమే తెలుసు. సోషల్ మీడియా ఒకరోజు నాకు శాపంగా మారుతుందని ఊహించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో నా ప్రమేయం ఉందని తేలితే నేను ఎలాంటి చర్యకైనా సిద్ధం. కానీ నా మీద ఆరోపణలు తప్పుడు అని నిరూపితమైతే సుబ్బారావుపై ఏం చర్యలు తీసుకుంటారు? అంటూ మీడియాను ప్రశ్నించారు.
మొత్తానికి, ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. మంగ్లీ చేసిన ఆరోపణలు, భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.





