లేడీ సూపర్ స్టార్ నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను నడిగర్ సంఘం తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అస్సలు సమంజసం కాదని మండిపడింది.
నయనతారపై చేసిన వ్యాఖ్యలకు ఎంపీ షణ్ముగం బేషరతుగా క్షమాపణ చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది. అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా వెళ్తామని కూడా హెచ్చరించింది. సినీ తారలపై పదేపదే వ్యక్తిగతంగా దూషణలు చేయడం సహించబోమని సంఘం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, తమిళనాడులో సినీ రంగంలోని మహిళలపై కొందరు రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లను రాజకీయ వివాదాల్లోకి లాగుతూ, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనేలా వ్యాఖ్యలు చేయడం తరచుగా కనిపిస్తోందని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవలే నటి త్రిషపై కూడా ఒక రాజకీయ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు నయనతారపై కూడా అలాంటి వ్యాఖ్యలు రావడం కోలీవుడ్లో ఆగ్రహానికి కారణమైంది.
రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు అంశాలు దొరకనప్పుడు, సినీ తారల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలపై పార్టీలు కేవలం ఖండనలతో సరిపెట్టకుండా, సంబంధిత నేతలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇవి తగ్గుతాయని నడిగర్ సంఘం అభిప్రాయపడుతోంది.





