టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్కు ఆర్థిక సహాయం ప్రకటించి అభినందనలు అందుకుంటున్నారు. 17 ఏళ్ల నిరంజన్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఒకసారి కలవాలన్న అతని కోరిక గురించి ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన స్వయంగా హనుమకొండకు వెళ్లి నిరంజన్ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కూడా స్పందిస్తూ, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని, అతని కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి అభిమానిని పరామర్శించడం, బండ్ల గణేష్ ఆర్థిక సహాయం ప్రకటించడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.






