రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్లో విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్కు వెళ్తున్న యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట వద్ద జరిగిన ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈరోజు ఉదయం యూనిట్ సభ్యులు షూటింగ్కు వెళ్తుండగా, తూప్రాన్పేట సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
షూటింగ్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం ‘ఫౌజీ’ యూనిట్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మృతుడి కుటుంబానికి చిత్రబృందం ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తానికి, ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.






