జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ గా ప్రకటించారు. మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద నిర్వహించిన భారీ సభలో ఈ ప్రకటన చేశారు.
కవిత పార్టీ పేరు ప్రకటించగానే సభకు హాజరైన కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది.
TRS పేరు మళ్లీ రంగంలోకి
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ పార్టీ పేరు టీఆర్ఎస్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి (BRS)’ గా మార్చారు.
ఇప్పుడు అదే టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఆవిష్కరణ సభలో మాట్లాడిన కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని, జాగృతి సంస్థ తెలంగాణ సంస్కృతికి బలమైన పునాది వేసిందని అన్నారు. తెలంగాణ కలలు ఇంకా నెరవేరలేదని, బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని విమర్శించారు.
కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ.. ‘కేసీఆర్ మారిన మనిషి.. మర మనిషి.. మన మనిషి కాదు’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుత పాలనపై కూడా కవిత మండిపడ్డారు. గురుకులాల్లో చిన్నారులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూడు ప్రధాన పార్టీలు అవినీతి, బంధుప్రీతిలో మునిగిపోయాయని అన్నారు.
ఇప్పటి నుంచి తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్షమని, మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఐదు కీలక హామీలు
కవిత తన పార్టీ తరఫున ఐదు ప్రధాన హామీలు ప్రకటించారు.
- విద్య:
అందరికీ ఉచిత విద్య అందిస్తామని, ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పారు. - వైద్యం:
ఏ రోగమైనా, ఏ ఆస్పత్రిలో అయినా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. - వ్యవసాయం:
రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామని పేర్కొన్నారు. - ఉపాధి:
యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు, ఒకే నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ పోస్టులు ఇస్తామని తెలిపారు. - సామాజిక న్యాయం:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేస్తామని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు
కవిత TRS పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.





