ఒకప్పుడు టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమైన ఆయన, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’ లో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, మంచి స్పందన అందుకుంటోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్ గురించి ఆయన ఎంతో నిజాయితీగా మాట్లాడారు.
‘ఈ సినిమాలో శర్వానంద్ మెయిన్ హీరో అయితే, నేను సెకండ్ హీరోగా చేస్తున్నాను. నిజం చెప్పాలంటే.. ‘నేను సెకండ్ లెవెల్కు వచ్చేశానా?’ అన్న బాధ మొదట నాలో కలిగింది. ఒకప్పుడు సోలో హీరోగా ఉన్న నాకు ఇది కొంచెం కష్టంగా అనిపించింది’ అని ఆయన అన్నారు.
అయితే తన కుమార్తెలు శివాని, శివాత్మిక తనను ప్రోత్సహించారని, ప్రస్తుతం పరిస్థితులకు అలవాటు పడిపోయానని తెలిపారు.
ఇదే సందర్భంలో దర్శక నిర్మాతలకు ఆయన ఓ వినతిని కూడా చేశారు. ‘నన్ను ఆదరించండి.. నాకు మరిన్ని సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి’ అంటూ ఆయన అభ్యర్థించారు.
రాజశేఖర్ లాంటి సీనియర్ నటుడు ఇలా ఓపెన్గా తన మనసులోని భావాలను పంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్ కలగలిపిన కథతో రాబోతోంది.
సెకండ్ ఇన్నింగ్స్లో రాజశేఖర్ క్యారెక్టర్ రోల్స్తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





