ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత సీజన్లో మొదటిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ ఇప్పుడు తన హోమ్ వేదికపై మార్పు చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
గత జూన్ 4న బెంగళూరులో జరిగిన RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట (Stampede) ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో పలువురు గాయపడగా, స్థానిక అధికారులు దీనికి ఆర్సీబీ యాజమాన్యాన్నే బాధ్యులుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియాన్ని తాత్కాలికంగా మూసివేసి, దానిని పునరుద్ధరించే వరకు ఆర్సీబీకి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.
దీంతో యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 2026 ఐపీఎల్ సీజన్లో తమ హోమ్ మ్యాచ్లను పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అధికారిక వర్గాల ప్రకారం..
“RCB తమ హోమ్ మ్యాచ్లను పుణేలో ఆడే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకా తుది నిర్ణయం రాలేదు. సాంకేతిక, లాజిస్టిక్ అంశాలపై విశ్లేషణ జరుగుతోంది. అన్ని అనుమతులు లభిస్తే, 2026 సీజన్లో పుణే RCB మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది” అని వెల్లడించారు.
2022లో IPL మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన MCA స్టేడియం గహుంజే – పుణే, మళ్లీ లీగ్ ఉత్సాహాన్ని చూసే అవకాశం ఉంది.
అయితే ఈ పరిణామం బెంగళూరు అభిమానులను నిరాశపరచవచ్చు. తమ జట్టు హోమ్ గ్రౌండ్ మార్చడం వల్ల అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్లు చూడలేకపోవడం షాక్కు గురిచేస్తోంది.
ఇక హోమ్ వేదిక మార్పుపై వస్తున్న వార్తలపై RCB యాజమాన్యం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తుది నిర్ణయం వెలువడే వరకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





