జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు “కారును షెడ్డుకి పంపించారని” సీఎం రేవంత్ విమర్శించారు. “బిల్లారంగాలు” (కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశిస్తూ) ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆటోల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేదల దైవం పీజీఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా విజయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఆ సమయంలో టీడీపీ కూడా మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. అయితే కేసీఆర్ అప్పట్లో ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టి దుష్ట రాజకీయ సంప్రదాయానికి తెరలేపారని విమర్శించారు.
ఆస్తిలో వాటా అడుగుతుందని సొంత చెల్లెలు కవితను ఇంటి నుంచి, పార్టీ నుంచి తరిమివేసిన కేటీఆర్.. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి సునీతను గెలిపించాలని తిరుగుతున్నాడు. ఇది చూసి ‘కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట’ అనే సామెత గుర్తొస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతేకాక, ప్రచారానికి ముందు కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకొని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు అక్రమంగా సంపాదించుకున్నారని కవితే ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. “దమ్ముంటే ముందుగా ఆ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం ఇవ్వాలి” అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.





