భారత అథ్లెటిక్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఘనత సాధించిన ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశ రక్షణ రంగంలో ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ (Honorary Lieutenant Colonel) హోదాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు థల్సేనాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రదానం చేశారు.
నీరజ్ చోప్రా దేశానికి అందించిన క్రీడా సేవలు, అంకితభావం, యువతకు స్ఫూర్తిగా నిలిచిన విధానం ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. ఈ హోదా టెరిటోరియల్ ఆర్మీ (Territorial Army) పరిధిలో ఉంటుంది, ఇది భారత సైన్యంలో “సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్”గా పనిచేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.

హర్యానాలోని పానిపట్ జిల్లాకు చెందిన నీరజ్ చోప్రా 2016లో నాయబ్ సుబేదార్గా భారత సైన్యంలో చేరారు. ఒకవైపు సైనిక బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు అథ్లెటిక్స్లో నిరంతర సాధనతో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో (2021లో నిర్వహించబడినవి) ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించారు. అనంతరం పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం గెలిచి, ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి భారత కీర్తిని మరింత పెంచారు.
#WATCH | Delhi | Olympic medallist javelin thrower Neeraj Chopra conferred the honorary rank of Lieutenant Colonel in the Indian Army, in the presence of Defence Minister Rajnath Singh and COAS General Upendra Dwivedi pic.twitter.com/bjLwuvoSLj
— ANI (@ANI) October 22, 2025
ఇప్పటికే ఆయన సైన్యంలో సుబేదార్ మేజర్గా ఉన్నారు. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. గతంలో క్రికెటర్ ఎం.ఎస్. ధోని, షూటర్ అభినవ్ బింద్రాలకు కూడా ఇలాంటి హోదా లభించింది.
నీరజ్ చోప్రా ఈ గౌరవం ద్వారా మరోసారి దేశానికి అంకితమైన స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని సైన్యం పేర్కొంది.





