మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా విడుదలకు ముందు రాత్రి పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా కర్ణాటకలో పెద్ది ప్రీమియర్స్ సంచలన వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అందుతున్న వివరాల ప్రకారం, కర్ణాటకలో ప్రత్యేక ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం రూ.3.02 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో అక్కడ అత్యధిక ప్రీమియర్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో పెద్ది అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు మంచి వసూళ్లు నమోదు చేసిన పలు భారీ చిత్రాల రికార్డులను పెద్ది అధిగమించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో రామ్ చరణ్కు ఉన్న అభిమాన బలం, అలాగే సినిమాలో కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్ శివరాజ్కుమార్ క్రేజ్ కూడా ఈ వసూళ్లకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడటంతో, మొదటి రోజు వసూళ్ల విషయంలో కూడా పెద్ది భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.





