ఐపీఎల్ 2026 సీజన్లో నేడు క్రికెట్ అభిమానులకు డబుల్ హెడర్ ట్రీట్ సిద్ధమైంది. ఒకే రోజున రెండు హై-వోల్టేజ్ మ్యాచ్లు జరగనుండటంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఈ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రజిత్ పతిదర్ సొంత మైదానంలో రాణిస్తే ఆర్సీబీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ జట్టులో కె ఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్లు ఉండటం మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా మార్చుతోంది. పవర్ప్లేలో ఏ జట్టు ఆధిపత్యం చాటుకుంటుందో అదే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య కీలక పోరు జరగనుంది.
ఈ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు బలంగా నిలుస్తున్నారు. టాప్ ఆర్డర్లో వీరి మెరుపు ఆరంభాలు ప్రత్యర్థి జట్లకు సవాలుగా మారుతున్నాయి.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో అంతగా రాణించలేకపోతోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును తిరిగి ఫామ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం సీఎస్కేకు సమస్యగా మారింది.
అయితే నేటి మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఆడే అవకాశం ఉండటంతో చెన్నైకు ఇది ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు.
హైదరాబాద్ పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ దూకుడును చెన్నై అడ్డుకుంటుందా? లేక సొంత మైదానంలో హైదరాబాద్ మరో విజయం సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి, నేటి ఈ రెండు మ్యాచ్లు వీకెండ్లో క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయం.





