టీమిండియా ఆల్రౌండర్ తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 వరల్డ్ కప్-2026లో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తిలక్ వర్మను అభినందిస్తూ సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీ20 ప్రపంచకప్లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా గ్రూప్ దశలో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆయన ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తిలక్ వర్మకు ప్రత్యేక సన్మానం ఉండొచ్చని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మతో పాటు టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను కూడా ప్రభుత్వం ఘనంగా సత్కరించనున్నట్లు సమాచారం.

గతంలో సిరాజ్కు భారీ బహుమతి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఈసారి తిలక్ వర్మకు కూడా భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.





