ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ భారీ షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఫెడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జానీ మాస్టర్ యూనియన్ సభ్యులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రవర్తన సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే జూలై 14న నిర్వహించిన అంతర్గత విచారణకు హాజరుకావాలని సూచించినప్పటికీ, జానీ మాస్టర్ హాజరు కాలేదని ఫెడరేషన్ తెలిపింది. దీంతో ఆయనపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ, రాబోయే ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అంతేకాకుండా, ఇండస్ట్రీ వర్గాలకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే మరిన్ని క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసే సినిమాలు, ఇతర ప్రాజెక్టులకు ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారం అందించబోమని స్పష్టం చేసింది. ఈ సహాయ నిరాకరణ దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని వెల్లడించింది.
మరోవైపు, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. జనరల్ బాడీ తీసుకునే నిర్ణయాలను ప్రతి సభ్యుడు గౌరవించాలని సూచిస్తూ, వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి సాధారణ డ్యాన్సర్ల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.





