టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ చిత్రానికి ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమా కథపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, తమన్ సంగీతం మాత్రం ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉంటే, ‘ఓజీ’కి సీక్వెల్గా ‘ఓజీ 2’ కూడా రానున్నట్లు ఇప్పటికే సంకేతాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా తమనే సంగీతం అందించనున్నారు. తాజాగా ‘హృదయం మురళి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న తమన్తో అభిమానులు ‘ఓజీ… ఓజీ…’ అంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందించిన తమన్ ‘సెప్టెంబర్లో కలుద్దాం బ్రదర్’ అని చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
తమన్ చేసిన ఈ వ్యాఖ్యలతో సెప్టెంబర్లో ‘ఓజీ 2’కి సంబంధించిన ఏదైనా అప్డేట్ లేదా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే తమన్ వ్యాఖ్యలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమన్ చేసిన ఒక్క వ్యాఖ్యతోనే సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్గా మారింది.





