అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఏజెంట్ తర్వాత అఖిల్కు ఈ స్థాయి విజయం దక్కడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన లెనిన్ సక్సెస్ మీట్లో పాల్గొన్న నాగార్జున, తెలుగు చిత్రాల విడుదల తేదీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ చిత్రాల ప్లానింగ్ను ఉదాహరణగా చెబుతూ, టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు కూడా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
హాలీవుడ్ చిత్రం ది ఒడిస్సీ విడుదల తేదీని ఏడాది ముందే ప్రకటించి, అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని నాగార్జున చెప్పారు. అయితే మన దగ్గర మాత్రం రిలీజ్ డేట్లు ప్రకటించిన తర్వాత కూడా చివరి నిమిషంలో వాయిదాలు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లెనిన్ విషయంలో కూడా ఇదే జరిగిందని, తొలుత జూన్ 26 విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే గతంలో తన నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య చిత్రాల సమయంలో విడుదలకు నెల రోజుల ముందే ఫైనల్ కాపీ సిద్ధంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకు అలాంటి ప్లానింగ్ చేయలేకపోతున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.
‘సినిమా నాణ్యంగా రావాలన్నా, దర్శకుడు, నిర్మాత, సాంకేతిక బృందం ప్రశాంతంగా పనిచేయాలన్నా విడుదలకు కనీసం రెండు వారాల ముందే అన్ని పనులు పూర్తి చేసి ఫైనల్ కాపీ సిద్ధంగా ఉంచాలి. ఇది ఇతరుల కోసం మాత్రమే కాదు.. నాతో పాటు ఇండస్ట్రీలోని ప్రతి దర్శకుడు, నిర్మాత ఆలోచించాల్సిన విషయం’ అని నాగార్జున అన్నారు.
ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టాలీవుడ్లో సినిమా ప్లానింగ్, విడుదల తేదీలపై ఆయన చేసిన సూచనలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.





